మురుగు కాలువలో పసికందు మృతదేహం లభ్యం
భైంసాలో అమానవీయ ఘటన
5 నుంచి 6 నెలల వయస్సు శిశువుగా గుర్తింపు
చిత్రం న్యూస్, భైంసా:ఏ తల్లి కన్నబిడ్డో..ఆ తల్లికి ఎందుకు భారమైందో తెలియదు. తన పొత్తిళ్ళలో నిద్రించాల్సిన ఆ శిశువు మురుగుకాలువ పాలయింది. కనులు తెరిచి లోకాన్ని చూడాల్సిన ఆ పసికందు లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. నిర్మల్ జిల్లాలోని మున్సిపల్ కేంద్రమైన భైంసాలో గురువారం ఈ అమానవీయ ఘటన వెలుగు చూసింది. కలకలం రేపింది.
మురుగు కాలువలో మృతదేహం లభ్యం
స్థానిక నర్సింహనగర్ కాలనీ ప్రాంతంలోని వేదం హైస్కూల్ పక్కన, రేయిన్బో హైస్కూల్ ముందరి భాగంలోని మురుగుకాలువలో శిశువు మృతదేహం లభ్యమయ్యింది. గుర్తు తెలియని వ్యక్తులు నెలలు నిండని పసికందును మురుగు కాలువలో పారవేసినట్లుగా తెలిసింది. మధ్యాహ్నం వేళలో అక్కడి మార్గం మీదుగా వెళ్తున్న కొందరు మురుగు కాలువలోని శిశువు మృతదేహాన్ని గుర్తించడంతో ఘటన వెలుగు చూసింది. సంబంధిత సమాచారం అందుకున్న పట్టణ సీఐ గోపీనాథ్ , మున్సి పల్ అధికారులు, సిబ్బందితో కలిసి మురుగు కాలువలో ఉన్న శిశువు పిండాన్ని బయటకు తీసారు. అక్కడి నుంచి ఏరియా ఆసుపత్రిలోని పోస్టుమార్టం గదికి తరలించారు. శిశువు మృతదేహం ఐదు నుంచి ఆరు నెలల వయసు ఉన్నట్లు గుర్తించారు.

