అంతర్రాష్ట్ర రహదారిపై గుంతలను పూశ్చాలని ఆర్&బీ అధికారి అజ్మత్ అలీకి వినతిపత్రం అందజేస్తున్న దృశ్యం
చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పొచ్చర క్రాస్ రోడ్డు నుండి సొనాల మండల కేంద్రం మీదుగా మహారాష్ట్ర వైపుకు వెళ్లే అంతరాష్ట్ర రహదారిపై కనుగుట్ట సమీపంలో గల పెద్ద వాగు దగ్గర, కౌట, సాకేర గ్రామల సమీపంలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. పొచ్చర బంక్ నుండి కౌఠ వరకు రోడ్డుకు ఇరువైపులా చెట్లు బాగా పెరిగిపోయాయి. వాటి వల్ల మలుపు వద్ద వచ్చే వాహనాలు కనిపించడం లేదు. ఈ అంతరాష్ట్ర మార్గం గుండా నిత్యం వందలాది వాహనాలు తమ రాకపోకలను కొనసాగిస్తుంటాయి. ఈ గుంతల కారణంగా ఇప్పటికే ఈ మార్గంలో పదుల సంఖ్యలో వాహనదారులు ప్రమాదాలకు గురయ్యారు. ఈ మార్గంలో గుంతలతో పాటు రోడ్డు కి ఇరువైపుల పెరిగిన చెట్లు, ముళ్ల పొదలు సైతం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. రోడ్డు పైకి వచ్చిన పొదల కారణంగా ముందర నుండి వచ్చే వాహనం కనిపించక పోవడంతో ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రమాదాలకు నెలవుగా మారిన గుంతలను పూడ్చివేయడంతో పాటు రోడ్డుకు అడ్డంగా వచ్చిన పొదలను తొలగించాలని కోరుతూ బుధవారం నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ బోథ్ మండల చైర్మన్ పూండ్రు ఆదిత్య రెడ్డి, కన్వీనర్ గొడిసెల రమణ గౌడ్ లు ఆర్&బీ అధికారి అజ్మత్ అలీకి వినతిపత్రంను అందజేశారు.


