Chitram news
Newspaper Banner
Date of Publish : 13 July 2025, 8:58 am Editor : Chitram news

ఏడాది పాలనలో ఎన్నో విజయాలు

కరపత్రం అందజేస్తున్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు

చిత్రం న్యూస్, కొత్తపేట: కూటమి ఏడాది పాలనలోనే ఇటు సంక్షేమం, అటు అభివృద్ధి అనే రెండు అంశాల్లో ఎన్నో విజయాలు సాధించామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. ఆదివారం ఆత్రేయపురం మండలంలో   నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి కూటమి పాలనలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు వివరించారు. వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ విధ్వంసం, అరాచక పాలన వల్ల రాష్ట్రం అధోగతి పాలైందని, అయినా కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చక్కదిద్ది ఏడాది పాలనలోనే పింఛన్‌ మొత్తాన్ని రూ.4 వేలకు పెంపు, తల్లికి వందనం, దీపం, మెగా డీఎస్సీ వంటి హామీలు ప్రతిష్టాత్మకంగా అమలు చేసిందని తెలిపారు. ‘అన్నదాత సుఖీభవ’ పథకం అమలుకు కసరత్తు పూర్తయిందని, పీఎం కిసాన్ పథకం తో పాటు నగదు జమవుతుందని తెలిపారు. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు జరుగుతుందన్నారు. ఈ విధంగా ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు కూటమి ప్రభుత్వం శతధా కృషి చేస్తుందన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధిని సైతం పరుగులు పెట్టిస్తుందని తెలిపారు. పల్లెల్లో ఐదేళ్ల పాలనలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేదని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. అందుకే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు.