పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉంది
*ఒక రోజు ఉద్యమ స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి పీతల సుజాత , ఎమ్మేల్యే పులపర్తి రామాంజనేయులు
చిత్రం న్యూస్, భీమవరం: పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మాజీ మంత్రి పీతల సుజాత, ఎమ్మెల్యే శ్రీ పులపర్తి రామాంజనేయులు అన్నారు. వీరవాసరం మండలం పంజా వేమవరం గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ పధకంలో భాగంగా ఒక రోజు ఉద్యమ స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని (వన మహోత్సవం) మాజీ మంత్రి పీతల సుజాత , స్థానిక ఎమ్మెల్యే శ్రీ పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ.. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందని, అందుకు తమవంతుగా అందరూ మొక్కలు నాటాలని అన్నారు. ఈ పథకంలో భాగంగా రైతులందరికీ ఉచితంగా మొక్కలు అందించి వారిని ఆర్ధికంగా పైకి తీసుకురావడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగిందన్నారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీ పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ.. ప్రతిఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటాలని, ఎక్కడైతే మొక్కలను నాటామో వాటిని వదిలి వేయకుండా వాటి సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలన్నారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే కూటమి సభ్యులతో కలిసి మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు శ్రీ మెంటే పార్థసారథి, జడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడు, ఎంపీపీ వీరవల్లి దుర్గాభవాని, కూటమిపక్ష నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్థులు పాల్గొన్నారు.