బాధితురాలికి బంగారు గొలుసు అప్పగిస్తున్న పోలీసులు
*సీసీ కెమెరాల ఆధారంగా దొంగ గుర్తింపు
చిత్రం న్యూస్, సామర్లకోట: విశాఖపట్నం పట్టణానికి చెందిన మహిళ కలిపిరెడ్డి నారాయణమ్మ సామర్లకోటలో పోగొట్టుకున్న మూడు తులాల బంగారు గొలుసు కేసును సామర్లకోట పోలీసులు ఛేదించారు. సీఐ కృష్ణ భగవాన్, ట్రాఫిక్ ఎస్ఐ అడపా గరగరావులు సీసీ కెమెరా ఆధారంగా వెతికిపట్టుకుని బాధితురాలికి బంగారు గొలుసును అందజేశారు. విశాఖపట్నం కొత్త సాలిపేట, జగదాంబ సెంటర్ ప్రాంతానికి చెందిన కలిపిరెడ్డి నారాయణమ్మ కాకినాడ పట్టణంలోని బంధువుల ఇంట్లో శుభకార్యానికి వచ్చారు .బంగారు గొలుసు పెట్టిన పర్సుని సామర్లకోట రైల్వే స్టేషన్ సెంటర్లో పోగొట్టుకున్నారు. బాధితురాలు నారాయణమ్మ దంపతులు శుభకార్యానికి హాజరయ్యేందుకు కాకినాడ బస్సు ఎక్కుతూ చూసుకోగా పర్సు లేకపోవడంతో ఆమె స్థానిక ట్రాఫిక్ ఎస్ఐ గరగారావుకు ఫిర్యాదు చేశారు. ట్రాఫిక్ ఎస్ఐ గరగారావు స్టేషన్ సెంటర్లోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించి పర్స్ కాజేసింది ఒక సాధువుగా గుర్తించారు. సాధువు కోసం రాత్రి 8 గంటల వరకు కాపు కాసి పోలీసులు అతనిని పట్టుకుని మహిళ పోగొట్టుకున్న బంగారు గొలుసులు రికవరీ చేసి బాధితురాలు నారాయణమ్మకు పెద్దాపురం డీఎస్పీ డి. శ్రీహరి రాజు చేతులమీదుగా అందజేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ. కాకినాడ శుభకార్యానికి వెళుతూ ఉదయం 8:30 గంటలకు సామర్లకోటలో బంగారు గొలుసును మహిళ పోగొట్టుకోగా సామర్లకోట సీఐ కృష్ణ భగవాన్, ట్రాఫిక్ ఎస్ఐ గరగారావులు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలతో సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఎంతో చాకచక్యంగా పోగొట్టుకున్న సొత్తును గుర్తించి బాధితురాలికి అప్పగించారన్నారు. ఈ సందర్బంగా స్థానిక సీఐ కృష్ణ భగవాన్, ట్రాఫిక్ ఎస్ఐ గరగారావులను, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు .బాధితురాలు నారాయణమ్మ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.