Logo
LIVE
హోం ఆరోగ్యం తెలంగాణ సినిమా క్రీడలు బిజినెస్
✖ Close హోం

బాగా చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి

*విద్యార్థులు పట్టుదలతో లక్ష్యాన్ని సాధించాలి

*తల్లులను గౌరవించాలి, ఇల్లు దాటే ముందు వారి ఆశీర్వాదం తీసుకోవాలి

*మనల్ని రక్షించే సైనికులకు గౌరవంగా సెల్యూట్ కొట్టాల్సిన బాధ్యత మనపై ఉంది

*ఇంకొల్లులో డాక్టర్ డీవీఆర్ సైనిక్ స్కూల్ ను లాంఛనంగా ప్రారంభించిన మంత్రి లోకేష్

చిత్రం న్యూస్,ఇంకొల్లుః  బాగా చదువుకున్నవారు రాజకీయాల్లోకి రావాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లా ఇంకొల్లు గంగవరం రోడ్డులో మాజీ మంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు  ఆధ్వర్యంలో నూతనంగా నెలకొల్పిన డాక్టర్ డీవీఆర్ సైనిక్ స్కూల్ ను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా సైనిక్ స్కూల్ ప్రధాన భవనంతో పాటు కంప్యూటర్, సైన్స్ ల్యాబ్, బాలబాలికల వసతి సముదాయం, క్యాంటీన్, మెస్ భవనాలను డీవీఆర్ సైనిక్ స్కూల్ సెక్రటరీ, కరస్పాండెంట్ హితేష్ చెంచురామ్ తో కలిసి మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన దగ్గుబాటి చెంచురామయ్య, దగ్గుబాటి నీలమోహన్ విగ్రహాలను మంత్రి ఆవిష్కరించారు.

గురువులను దేవుడితో సమానంగా గౌరవించాలి

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. గురుబ్రహ్మ, గురువిష్ణు, గురుదేవో, మహేశ్వర అంటారు. పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మన జీవితంలో గురువులు కీలకపాత్ర వహిస్తారు. నేను పదో తరగతి వరకు భారతీయ విద్యాభవన్ లో చదివాను. ఆనాడు ఉన్న మా ఉపాధ్యాయులు కానివ్వండి, ఇంటర్ లిటిల్ ఫ్లవర్ లో చదివినప్పుడు ఆనాడు ఉన్న అధ్యాపకులు కానివ్వండి.. మా గురువుగా ఉన్న ప్రొఫెసర్ రాజ్ రెడ్డి, కానివ్వండి. ఇప్పుడు కూడా నా జీవిత ప్రయాణంలో ఎంతోమంది గురువులు నాకు సలహాలు, సూచనలు ఇస్తుంటారు. అందుకే గురువులను దేవుడితో సమానంగా గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

మనం అందరం తల్లులను గౌరవించాలి, ఇల్లు దాటే ముందు వారి ఆశీర్వాదం తీసుకోవాలి

మన జీవితంలో అన్ కండిషనల్ గా మనల్ని ప్రేమించేది మన తల్లి. ఈ రోజు పెద్దలు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు సుందర్ పిచాయ్ గురించి చెప్పారు. నేను నిజంగానే ఆశ్చర్యపోయా. సుందర్ పిచాయ్ కోసం ఆయన తల్లి ఎన్నో త్యాగాలు చేశారు. తల్లుల త్యాగల వల్ల మనం చదువుకోగలుగుతున్నాం. తల్లుల త్యాగాల వల్ల మనం ఈ రోజు ఈ స్థాయికి వస్తున్నాం. అందుకే మనం తల్లులను గౌరవించాలి. ఇల్లు దాటే ముందు తప్పనిసరిగా తల్లి ఆశీర్వాదం తీసుకుని బయలుదేరాలని ఇక్కడ ఉన్న పిల్లలను కోరుతున్నా.

పేదరికం నుంచి బయటకు రావాలంటే అద్భుతమైన విద్యను అందించాలి

ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. పెద్దలు డాక్టర్ వెంకటేశ్వరరావు నాయకత్వంలో ఈ రోజు ఈ సైనిక్ స్కూల్ ను ఏర్పాటుచేసి మారుమూల ప్రాంతానికి ఏకంగా ఒక సైనిక్ స్కూల్ ను తీసుకురావడం జరిగింది. నేను బలంగా నమ్మేది పేదరికం నుంచి బయటకు రావాలంటే అద్భుతమైన విద్యను అందించాల్సిన అవసరం ఉంది. విద్య వల్లే మన జీవితాల్లో అద్భుతమైన మార్పులు వస్తాయి. ఆనాడు విజనరీ వ్యక్తి దగ్గుబాటి వెంకటేశ్వరరావు తండ్రి దగ్గుబాటి చెంచురామయ్య  విద్య శక్తి ఏంటో తెలుసుకుని 1980ల్లోనే అద్భుతమైన విద్యా సంస్థలను ఏర్పాటుచేశారు. ఇంటర్, డిగ్రీ, పీజీ కాలేజీలను ఏర్పాటుచేసి నిరుపేద కుటుంబాల పిల్లలకు ఆనాడు నాణ్యమైన విద్యను అందించారన్నారు. ఆయన వారసత్వాన్ని కొనసాగించేందుకు మా పెదనాన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పెద్దమ్మ దగ్గుబాటి పురందేశ్వరి , తమ్ముడు హితేష్, చెల్లి నివేదిత పేరిట అద్భుతమైన స్కూల్స్ ను ఏర్పాటుచేశారన్నారు. కేజీ నుంచి పీజీ వరకు అద్భుతమైన విద్య అందించాలనే లక్ష్యంతో ఈ కుటుంబం ఈ రోజు పనిచేస్తోంది. ఈ ఏడాది నుంచి సైనిక్ స్కూల్ ను ఏర్పాటుచేశారాన్నారు.

*నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో సైనిక్ స్కూల్ ను ఏర్పాటుచేయడం ఆనందంగా ఉంది

 

పెదనాన్న అధికారంలో ఉన్నా, లేకపోయినా అహర్నిశలు ప్రజల కోసం పనిచేయాలన్న మంచి ఆలోచనతో ఈ రోజు సైనిక్ స్కూల్ ను ఏర్పాటుచేయడం జరిగింది. గతంలో ఆయన ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించారు. ఈనాడు పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ఈ రోజు సైనిక్ స్కూల్ ను ఏర్పాటుచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మూడో తరం కూడా వచ్చింది. ఆ మూడో తరం పేరే హితేష్. తాత, తండ్రి ఆలోచనలను ముందుకు తీసుకెళ్తున్నారు. నాణ్యమైన విద్య నిరుపేద విద్యార్థులకు అందించాలనే లక్ష్యంతో హితేష్ పనిచేస్తుండటం చాలా ఆనందంగా ఉంది. మీకు అండగా నిలబడతాం. ప్రభుత్వ పరంగా సహకరిస్తాం. ఈ పవిత్రమైన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నామని లోకేష్ అన్నారు.

*మనల్ని రక్షించే సైనికులకు గౌరవంగా సెల్యూట్ కొట్టాల్సిన బాధ్యత మనపై ఉంది

సైనిక్ స్కూల్ గురించి మాట్లాడినప్పుడు నాకు గుర్తుకువచ్చేది పహల్గాం ఉగ్రదాడి ఘటన. శత్రువులను ప్రధాని మోదీ ధీటుగా ఎదుర్కొన్నారు. వారికి సరైన గుణపాఠం చెప్పారు. మన సైనికులు మనకోసం నిలబడుతున్నారు. మనకోసం పోరాడుతూ జవాన్ మురళీనాయక్ చనిపోయారు. మురళీ నాయక్ తల్లిదండ్రులను నేను పరామర్శించాను. ఆ కుటుంబానికి ఆయన ఒక్కరే బిడ్డ. ఆర్మీలోకి వద్దని తల్లిదండ్రులు చెప్పినా దేశానికి సేవ చేస్తానని వెళ్లాడు. ఒకవేళ చనిపోతే దేశం మొత్తం కుటుంబానికి అండగా నిలుస్తుందని చెప్పిన వ్యక్తి మురళీ నాయక్. సైనికుల త్యాగాల వల్లే నేడు మనం సురక్షితంగా ఉండగలుగుతున్నాం. ఇలాంటి అద్భుతమైన సైనికులను అందించేందుకే సైనిక్ స్కూల్ ను ఏర్పాటుచేశారు. మన ప్రాంతాల నుంచి వెళ్లిన సైనికులు తిరిగివచ్చినప్పుడు వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. సైనికులకు గౌరవంగా సెల్యూట్ కొట్టాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు.

*విద్యార్థులు పట్టుదలతో లక్ష్యాన్ని సాధించాలి

ఇక్కడ పిల్లలను చూస్తుంటే దేవాన్ష్ గుర్తుకువస్తున్నాడు. దేవుడు మనకు పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలు జయించే శక్తి కూడా ఇస్తాడు. ఒక్క ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మనం భయపడాల్సిన అవసరం లేదు. జీవిత ప్రయాణంలో మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం. మనందరం రోడ్ లెస్ ట్రావెల్ ఎంచుకోవాలి. కష్టమైన మార్గమైనా ఎంచుకోవాలి. 40 ఏళ్లుగా గెలవని మంగళగిరిని ఎంచుకుని నేను పోటీచేశా. మొదటిసారి ఓడిపోయాను. రెండోసారి కసితో పనిచేసి రాష్ట్రంలో మూడో అత్యధిక మెజార్టీతో విజయం సాధించాను. నన్ను ఎంతో ఎగతాళి చేశారు. గెలుపే లక్ష్యంగా పెట్టుకుని పనిచేశా. పట్టుదలతో లక్ష్యాన్ని సాధించాలన్నారు.

*బాగా చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి

రెండో సాహసోపేత నిర్ణయం విద్యాశాఖ తీసుకోవడం. చాలామంది వద్దన్నారు. ఛాలెంజ్ లు అంటే నాకు చాలా ఇష్టం. ఆ ఛాలెంజ్ లు స్వీకరిస్తా. ఏపీలో ప్రభుత్వ విద్య ఎలా ఉంటుందో చేసి చూపిస్తానని చెప్పడం జరిగింది. విద్యాశాఖలో సంస్కరణలు తీసుకువచ్చాం. దేశం మొత్తం రాష్ట్రం వైపు చూసేలా విద్యావ్యవస్థను తీర్చిదిద్దే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. పిల్లలు ఛాలెంజ్ లను నవ్వుతూ స్వీకరించాలి. విశాఖలో జరిగిన ప్రపంచ యోగా దినోత్సవంలో 3 లక్షల మందికి పైగా యోగసనాలు వేసి గిన్నీస్ రికార్డ్ సాధించాం. ఇందుకు మంత్రుల సంఘం ఛాలెంజ్ గా తీసుకుని పనిచేశాం.. యువతకు ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. అనేక పెట్టుబడులు తీసుకువస్తున్నాం. బాగా చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి. దేశంలో మార్పు కోసం కష్టపడాలి. రాజకీయాల ద్వారా ఆ మార్పు తీసుకురావాలి. బాగా చదవండి. జీవితంలో సెటిల్ అయి దేశానికి సేవ చేసేందుకు తిరిగి రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నానన్నారు.  అంతకుముందు కళాశాల ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు మాజీ మంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, డాక్టర్ డీవీఆర్ సైనిక్ స్కూల్ సెక్రటరీ, కరస్పాండెంట్ హితేష్ చెంచురామ్ తదితరులు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, డాక్టర్ డీవీఆర్ సైనిక్ స్కూల్ సెక్రటరీ, కరస్పాండెంట్ హితేష్ చెంచురామ్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, బాపట్ల ఎమ్మెల్యే వి.నరేంద్ర వర్మ, చీరాల ఎమ్మెల్యే ఎంఎమ్ కొండయ్య, మాజీ ఎమ్మెల్యే గరటయ్య, బాపట్ల జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళీ, బాపట్ల ఎస్పీ తుషార్ డూడీ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments

-Advertisement-

spot_img