రేషన్ దుకాణాల ద్వారానే సరుకులు పంపిణీ
చిత్రం న్యూస్, పెద్దాపురం: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ 1 నుంచి రేషన్ కార్డు దారులకు రేషన్ దుకాణాల ద్వారానే సరుకులు పంపిణీ చేయనున్నందున కార్డు దారులు రేషన్ దుకాణాల వద్దకే వెళ్లాలని సామర్లకోట తహసీల్దార్ కొవ్వూరి చంద్ర శేఖర రెడ్డి చెప్పారు. శుక్రవారం సామర్లకోట తహసీల్దార్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో తహసీల్దార్ మాట్లాడుతూ.. ఎండీయు వాహనాల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ ప్రక్రియలో పీడీఎస్ బియ్యం పక్కదారి పడుతుందని ప్రభుత్వం గుర్తించి ఆ వాహనాలను రద్దు చేయడం తో పాత విధానాన్ని పునరుద్ధరించారన్నారు. ప్రతి నెలా 1 నుంచి 15 వరకూ అన్ని రేషన్ దుకాణాలు తెరిచి ఉంచి రేషన్ సరుకులు పంపిణీ చేయాలన్నారు. వృద్దులు, దీర్ఘ కాల వ్యాధులతో బాధపడుతున్నవారు, ఎటూ కదలలేని వారికి ఆయా రేషన్ డిపో నిర్వాహకులు నేరుగా కార్డుదారుడి ఇంటికి వెళ్లి రేషన్ సరుకులు పంపిణీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఈ సందర్భంగా డీటీ వై. శ్రీనివాస్, ఎంఎస్ఓ కమల కుమారి, కార్యాలయ ఏవో పద్మ, డీలర్లు పాల్గొన్నారు.