ప్రకృతి పూజతోనే సంస్కృతి పరిరక్షణ: జిల్లా కలెక్టర్ రాజర్షిషా
చిత్రం న్యూస్, భోరజ్: వినాయక నవరాత్రుల సందర్భంగా శుక్రవారం భోరజ్ మండలం రాంపూర్(టి) గ్రామంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. గ్రామంలో ప్రతిష్ఠించిన వినాయకుడికి జిల్లా కలెక్టర్ శుక్రవారం రాజర్షిషా దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయకుడిని దర్శించుకున్న ఆయన, ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం మండపంలో 2,100 దీపోత్సవ వేడుకలను మొదటి జ్యోతి వెలిగించి ప్రారంభించి, గ్రామ ప్రజలతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..రాంపూర్ గ్రామంలో ఇంత ఘనంగా, నిష్టతో గణేష్ ఉత్సవాలు జరగడం అభినందనీయమని కొనియాడారు. మట్టితో తయారు చేసిన విగ్రహాలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించడం మన సంప్రదాయమని, ఇదే స్ఫూర్తిని జిల్లాలోని మిగతా గ్రామాలు సైతం ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామ అభివృద్ధికి యంత్రాంగం తరఫున పూర్తి సహకారం ఉంటుందని భరోసా కల్పించారు. ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో, మంచి సంకల్పంతో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బాబు సింగ్, సర్పంచ్ సురేఖ శ్రీనివాస్, గ్రామ పెద్దలు, యువజన గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, నిర్వాహకులు, మహిళలు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.