విశ్వకర్మల సమస్యల పరిష్కారానికి అండగా ఉంటా : మాజీ మంత్రి జోగు రామన్న
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వకర్మల సమస్యలను పరిష్కరించాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని టీఎన్జీవోస్ భవన్ లో నిర్వహించిన విశ్వకర్మ జయంతి కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొన్నారు. తొలుత సంఘ సభ్యులతో కలిసి విశ్వకర్మ దేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్వాహకులు జోగు రామన్నను డప్పు చప్పుళ్ల మధ్య సాదరంగా ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ.. విశ్వకర్మ జయంతి పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. పట్టణంలోని విశ్వకర్మ ఆలయ అభివృద్ధితో పాటు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి గతంలో రూ.25 లక్షలు కేటాయించి నిర్మాణాన్ని పూర్తి చేశామని తెలిపారు. అలాగే తెలంగాణ ఉద్యమకారుడు శ్రీకాంత్ చారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన స్ఫూర్తిని స్మరించుకుంటున్నామని పేర్కొన్నారు. తెలంగాణలో ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు దక్కుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విశ్వకర్మ పథకం ద్వారా లబ్ధిదారులకు అందాల్సిన రూ.20 వేల సహాయం ప్రతి ఒక్కరికీ ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే విశ్వకర్మల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. విశ్వకర్మల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం కొనసాగితే బీసీ సంఘాల నాయకులతో కలిసి మంత్రులను కలిసి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం పోరాడతామని తెలిపారు. బీసీ సంఘ భవనానికి గత ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేసినప్పటికీ నిర్మాణ విషయంలో నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. విశ్వకర్మ సమాజం వివిధ వృత్తులతో పాటు నిర్మాణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నా వారికి తగిన ప్రోత్సాహం, ఆదరణ లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వకర్మ సమాజం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తాను ఎల్లవేళలా అండగా ఉంటానని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వారి సమస్యలను పరిష్కరించే వరకు వారి పక్షాన పోరాడుతానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం సభ్యులు సంతోష్, దిలీప్, దత్తు నాగరావు, రాకొండే వెంకటి, సంతోష్, మాజీ ఎంపీపీ మార్చెట్టి గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.