లాడ్జీలు, దాబాల్లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు
చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లాబాసర మండల కేంద్రంలో పలు లాడ్జీలు, దాబాలలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ఏఎస్పీ సాయికిరణ్, ఆదేశాల మేరకు ముథోల్ సీఐ రవీందర్ నాయక్, బాసర సీఐ దీపక్ ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా లాడ్జీల నిర్వాహకులు నిర్వహిస్తున్న రిజిస్టర్లను, వచ్చిపోయే వారి వివరాలను వారు క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా సీఐ దీపక్ మాట్లాడుతూ.. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా సహించేది లేదని హెచ్చరించారు. లాడ్జీలకు వచ్చేవారి ఆధార్ కార్డు, ఇతర అధికారిక గుర్తింపు కార్డులు (ID Proofs) తీసుకున్న తర్వాతే గదులు కేటాయించాలన్నారు. సీసీ కెమెరాల నిర్వహణ, ప్రతీ లాడ్జీ, దాబా వద్ద సిసి కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని, అవి 24 గంటలు పనిచేసేలా చూడాలని స్పష్టం చేశారు. అపరిచిత, అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేందుకు ప్రయత్నించినా వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. దాబాల వద్ద మద్యం తాగడం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. ఈ తనిఖీల్లో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.