Chitram news
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 5:38 pm Editor : Chitram news

దళితులను అవమానించే చర్యలపై జైనథ్ పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు

దళితులను అవమానించే చర్యలపై జైనథ్ పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు

చిత్రం న్యూస్, జైనథ్: దళిత నాయకులు నిర్వహించిన నిరసన కార్యక్రమం జరిగిన ప్రాంతాన్ని ‘శుద్ధి’ పేరుతో పాలతో కడగడం, పసుపు నీళ్లు చల్లడం వంటి చర్యలను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జైనథ్ పోలీస్ స్టేషన్‌లో సీఐ శ్రావణ్ కుమార్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ, డీసీసీ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్ల ఆదేశాల మేరకు, టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ వైస్ చైర్మన్ దుర్గం శేఖర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు జైనథ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా దుర్గం శేఖర్ మాట్లాడుతూ.. దళితులను అవమానించేలా, అంటరానితనాన్ని ప్రోత్సహించేలా ఉన్న ఇటువంటి చర్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం, ప్రతి మనిషి గౌరవాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్‌మెంట్ నిరంతరం పోరాడుతుందని దుర్గం శేఖర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ రాహుల్ చంద్రాల, జిల్లా మీడియా కోఆర్డినేటర్ మేకల జితేందర్, డీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ వైస్ చైర్మన్ శివాజీ, సెక్రటరీ లింగన్న, సెక్రటరీ బిక్కి గంగన్న, బేల మండల అధ్యక్షుడు మందాకిని ప్రభాకర్, జైనథ్ మండల అధ్యక్షుడు కోడిచెర్ల పోచన్న, కోడిచెర్ల లస్మన్న, ఎస్సీ డిపార్ట్‌మెంట్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.