బాసరలో రూ.20 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
చిత్రం న్యూస్ బాసర : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం వేదపండితులు ఆశీర్వచనం చేయగా, అధికారులు అమ్మవారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలు అందజేశారు.
అనంతరం గోదావరి బాసర ఘాట్ వద్ద రూ.20 కోట్లతో చేపట్టనున్న పర్యాటక, మౌలిక వసతుల అభివృద్ధి పనులకు, బాసర వరలక్ష్మి ఆశ్రమం సమీపంలో శ్రీశ్రీశ్రీ దశరథ మహారాజు విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించి పనులకు శ్రీకారం చుట్టారు. బాసర ఈవో కార్యాలయంలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై రివ్యూ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బాసరకు వచ్చే భక్తులకు, ముఖ్యంగా అక్షరాభ్యాసం కోసం వచ్చే పిల్లలు, తల్లిదండ్రులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, గోదావరి ఘాట్ వద్ద భక్తుల రక్షణ, పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ స్నానఘాట్ల విస్తరణ, లైటింగ్, దుస్తులు మార్చుకునే గదుల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేస్తామని, రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని తెలిపారు.
కార్యక్రమంలో కలెక్టర్ భవేష్ మిశ్రా, సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, జడ్పీ చైర్మన్ దండే విఠల్, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, మాజీ మంత్రి వేణుగోపాల్ చారి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్, ఏఎస్పీ సాయికిరణ్, ఆలయ ఈవో అంజనాదేవి తదితరులు పాల్గొన్నారు.