రోడ్డులేని ఆదివాసీ గూడాలకు దారి చూపిన యూత్ కాంగ్రెస్ నేత
చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం గణేష్పూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రాయ్పూర్-కె, రాయ్పూర్-టీ గ్రామాల ప్రజలు ఏళ్లుగా రోడ్డు లేక నరకం చూస్తున్నారు. అటవీ నిబంధనలతో అధికారులు రోడ్డు వేయకపోవడంతో గర్భిణులు, రోగులను 4 నుంచి 5 కిలోమీటర్లు మోసుకుంటూ తీసుకెళ్లాల్సిన దుస్థితి. ఈ విషయం యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి దృష్టికి రాగా ఆయన స్వయంగా గ్రామాలకు వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. అధికారులు స్పందించకపోవడంతో సోమవారం తన సొంత నిధులతో జేసీబీని తీసుకువచ్చి రెండు గ్రామాలకు తాత్కాలికంగా రోడ్డు వేయించారు. దీంతో ఆదివాసీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ రూపేష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. శాశ్వత రోడ్డు కోసం జిల్లా కలెక్టర్ చొరవ తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ టేకం నాగారావు, మాజీ ఉపసర్పంచ్ కాటోడా, సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ మేకల జితేందర్, యువ నాయకుడు నాయన్ పాల్గొన్నారు.