Chitram news
Newspaper Banner
Date of Publish : 31 August 2026, 6:47 pm Editor : Chitram news

మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలి :మాజీ మంత్రి జోగు రామన్న

మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలి :మాజీ మంత్రి జోగు రామన్న

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: అన్నాభావు సాఠే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వంటి మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యలో రాణించేలా కృషి చేయాలని మాజీ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని భగత్‌సింగ్ నగర్‌లో నిర్వహించిన అన్నాభావు సాఠే జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా జోగు రామన్న మొదటగా అన్నాభావు సాఠే, లాహుజీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జోగు రామన్నను స్థానికులు శాలువాతో ఘనంగా సత్కరించారు.

గురుకులాలతోనే నాణ్యమైన విద్య: సమావేశంలో జోగు రామన్న మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో బడుగు, బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో బీసీ, మైనార్టీ తదితర గురుకుల విద్యాసంస్థలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఈ గురుకులాల ద్వారా ఎంతోమంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి.. నేడు ఇంజినీర్లుగా, వైద్యులుగా, ఇతర ఉన్నత స్థానాల్లో రాణిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. అలాగే, ఆదిలాబాద్‌లోని కేంద్రీయ విద్యాలయానికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే పది ఎకరాల స్థలాన్ని కేటాయించి, విద్యా సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు.

ఉన్నత స్థానాలకు చేరుకోవాలి:అన్నాభావు సాఠే గొప్ప సాహితీవేత్తగా, సామాజిక చైతన్యవేత్తగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారని కొనియాడారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని సూచించారు. బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యను అందిపుచ్చుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా తల్లిదండ్రులు, సమాజ పెద్దలు ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అజయ్, దమ్మపాల్, సచిన్, గైక్వాడ్ యాదవ్, సునీల్ వాగ్మారే, సూర్యవంశీ, శివాజీ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.