ప్రజా సమస్యల పరిష్కారానికి చక్కటి వేదిక కంది శ్రీనివాస్ రెడ్డి ప్రజా దర్బార్
చిత్రం న్యూస్,ఆదిలాబాద్: ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకొని తక్షణ పరిష్కారం చూపేందుకు ఆదిలాబాద్ అసెంబ్లీ ఇంఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి ప్రజా దర్బార్ చక్కటి వేదికగా నిలుస్తుంది. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజా సేవా భవన్లో మంగళవారం ప్రజా దర్బార్ ను కంది శ్రీనివాస్ రెడ్డి నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను కంది శ్రీనివాస్ రెడ్డికి అందజేశారు. ప్రతి సమస్యను ఓపికగా విన్న ఆయన, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తూ, ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కంది శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ ధ్యేయమని, ప్రజా దర్బార్ ద్వారా ప్రతి ఒక్కరి గోడును నేరుగా తెలుసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, మండల అధ్యక్షులు, సర్పంచ్లు, ఉపసర్పంచూలు,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.