గ్రామీణ ప్రజల ఆర్థికాభివృద్ధే టీజీబీ లక్ష్యం
* వెన్నంపల్లిలో నూతన శాఖ ప్రారంభం
* ‘మన గ్రామం – మన అభివృద్ధి’ ‘పేరిట గ్రామసభ
* కరీంనగర్ రీజినల్ మేనేజర్ కత్తి శ్రీనివాస్
చిత్రం న్యూస్, సైదాపూర్ ప్రతినిధి: గ్రామీణ ప్రజల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (టీజీబీ) నిరంతరం కృషి చేస్తోందని కరీంనగర్ రీజినల్ మేనేజర్ కత్తి శ్రీనివాస్ అన్నారు. వెన్నంపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన టీజీబీ బ్రాంచ్ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు. అనంతరం ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవలపై అవగాహన కల్పించేందుకు “మన గ్రామం – మన అభివృద్ధి” అనే నినాదంతో ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ.. బ్యాంకు అందిస్తున్న వివిధ రకాల డిపాజిట్లు, వ్యవసాయ, వ్యాపార, విద్యా రుణాలతో పాటు ప్రభుత్వ సబ్సిడీలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సామాన్యులకు భద్రత కల్పించే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన పథకాల ప్రాముఖ్యతను వివరించారు. ఖాతాదారులకు మరింత చేరువయ్యేందుకు ఏఈపీఎస్, మొబైల్ బ్యాంకింగ్ వంటి ఆధునిక, డిజిటల్ సేవలను బ్యాంక్ అందిస్తోందని తెలిపారు. బ్యాంకు సేవలను విస్తృతంగా వినియోగించుకుంటూ గ్రామ సమగ్రాభివృద్ధికి భాగస్వాములు కావాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట చీఫ్ మేనేజర్ శ్రీనివాస్ రాజు, ఉప్పల్-కె చీఫ్ మేనేజర్ వెంకటేశ్వర్లు, ఆపరేషన్స్ సీనియర్ మేనేజర్ సుబ్బారావు, బిజినెస్ సీనియర్ మేనేజర్ వంశీకృష్ణ, వెన్నంపల్లి బ్రాంచ్ మేనేజర్ నాగేంద్ర పాల్గొన్నారు. అలాగే పరిసర ఆరు గ్రామాల సర్పంచులు చిరంజీవి, శ్రీకాంత్, లావణ్య, స్వప్న, అనితతో పాటు పలువురు సైదాపుర్ పాక్స్ ఇన్చార్జ్ పర్సన్ కొత్త తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి, గ్రామ పెద్దలు, ఖాతాదారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.