ఉపాధిహామీ పథకానికి తూట్లు పొడవొద్దంటూ వామపక్ష పార్టీల రాస్తారోకో
వామపక్ష పార్టీల ఆందోళనలో పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జాతీయ ఉపాధి హామీ పథకానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిధులు కోత పెడుతూ పథకాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తోందని ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించడం అప్రజాస్వామిక చర్య అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో శుక్రవారం ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్ గూడ రహదారిపై నిర్వహించిన రాస్తారో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ ప్రజల గుండెల్లో మహాత్మా గాంధీ పేరు చిరస్మరణీయమై నిలిచిపోయిందని, ఎవరూ ఆ పేరును చెరపలేరని అన్నారు.అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో గ్రామీణ పేదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు 100 రోజుల ఉపాధి కల్పించేందుకు ప్రవేశపెట్టిన ఈ పథకం కోట్లాది కుటుంబాలకు అండగా నిలిచిందన్నారు.2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉపాధి హామీ పథకానికి క్రమంగా నిధులు తగ్గిస్తూ వస్తోందని ఆరోపించారు. పథకం అమలు బాధ్యతల నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోందని, ఇది పేదలు, కూలీల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు.
రాజ్యాంగాన్ని మార్చే కుట్రలకు బీజేపీ తెరలేపిందని, మనుస్మృతి అమలు చేయాలనే పన్నాగంతో ముందుకు సాగుతోందని విమర్శించారు. లౌకికవాద దేశంలో మోదీ, అమిత్ షా పప్పులు ఉడకవని, వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి బుద్ధి చెబుతారని అన్నారు.ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామీణ కూలీలు, ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
