బేల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిజిటల్ స్క్రీన్ ప్రారంభం
చిత్రం న్యూస్, బేల: తెలంగాణ విద్యా వారోత్సవాలు, ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం బేల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూతన డిజిటల్ స్క్రీన్ను ఉప సర్పంచ్ ప్రకాష్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ భగవాండ్లు మాట్లాడుతూ విద్యార్థులకు కీలక మార్గదర్శకత్వం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన ఉచిత విద్యను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కళాశాలలో అంకితభావం, సుదీర్ఘ అనుభవం కలిగిన ఉత్తమ అధ్యాపకులచే బోధన అందుతోందని గుర్తుచేశారు. విద్యార్థులకు అవసరమైన స్కాలర్షిప్లు, ఉచిత పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, రక్షిత మంచినీటి సౌకర్యం, అత్యాధునిక ప్రయోగశాలలు వంటి అన్ని వసతులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని వివరించారు.అకడమిక్ చదువులతో పాటు రాబోయే పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆధునిక దృశ్య శ్రవణ పరికరాలను (డిజిటల్ స్క్రీన్లు) ఉపయోగించుకోవాలని సూచించారు. వీటి ద్వారా విద్యార్థులు ఉన్నత భవిష్యత్తును అందుకోవడమే కాకుండా, సమాజంలో ఉత్తమ పౌరులుగా పేరు తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్తో పాటు అధ్యాపకులు నరేందర్, రూపేందర్ రెడ్డి, మొహమ్మద్ వైద్ ఖాన్, వినోద్, ఎబివిపి నాయకుడు హరీష్ మడావార్, ఇతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
