ఎండీఎం ఆదిలాబాద్ జిల్లా మహాసభ విజయవంతం: కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: మధ్యాహ్న భోజన పథకం ( ఎండీఎం ) వర్కర్స్ యూనియన్ ఆదిలాబాద్ జిల్లా మహాసభ సీపీఐ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఎండీఎం రాష్ట్ర కమిటీ, ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ సభ్యులు కుంటాల రాములు నాయకత్వంలో జరిగిన ఈ సభకు జిల్లాలోని వివిధ మండలాల నుంచి ఎండీఎం కార్మికులు, కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కుంటాల రాములు మాట్లాడుతూ.. 24 ఏళ్లుగా బడి పిల్లలకు పోషకాహారం అందిస్తున్న ఎండీఎం కార్మికులను ప్రభుత్వాలు శ్రమ దోపిడీ చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన రూ.10 వేల హామీని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటుపరం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
యూనిఫాం, రూ.10 లక్షల ప్రమాద బీమా, వయసు పైబడిన కార్మికులకు రూ.5 వేల పెన్షన్ కల్పించాలని మహాసభలో తీర్మానించారు. జూన్ నెలలోగా వేతనాలు పెంచకుంటే స్కూళ్లు తెరిచేలోపు వంటలు బంద్ చేసి జిల్లా వ్యాప్త సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటాలకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం నూతన జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షురాలిగా శ్రీదేవి, ప్రధాన కార్యదర్శిగా కుంటాల రాములు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా లక్ష్మి, గంగామణి, శశికళ, రాంబాయి, పుష్పలత, శకుంతల, రాజారామ్, యశ్వంత్, సుజాత, సునీత, బుజ్జక్క, కోశాధికారిగా ఉప్మా బాయిలను ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి సీపీఐ జిల్లా నాయకులు మెమెంటోలు అందజేశారు.
