‘ఫార్మర్ రిజిస్ట్రీ’ నమోదు తప్పనిసరి..లేదంటే పథకాలు కట్
చిత్రం న్యూస్ ,ఆదిలాబాద్: జిల్లాలోని రైతులందరూ ప్రభుత్వం నుండి అందే సంక్షేమ పథకాలు, రాయితీలు, యూరియా బుకింగ్ వంటి సేవలను పొందడానికి ‘ఫార్మర్ రిజిస్ట్రీ’లో తమ వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా సూచించారు. భవిష్యత్తులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే వివిధ వ్యవసాయ పథకాలకు ఈ రిజిస్ట్రేషన్ నంబర్ ప్రాథమిక అర్హతగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.ఈ ప్రక్రియను పూర్తి చేయని రైతులు రానున్న రోజుల్లో ప్రభుత్వ ప్రయోజనాలను కోల్పోయే ఆస్కారం ఉందని కలెక్టర్ హెచ్చరించారు. ఇప్పటివరకు నమోదు చేసుకోని రైతులు వెంటనే సమీపంలోని మీ-సేవ (MeeSeva) కేంద్రాలను గానీ లేదా తమ ప్రాంత వ్యవసాయ విస్తరణాధికారులను (AEO) గానీ సంప్రదించి, సకాలంలో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
