సాత్నాల ప్రాజెక్టు కుడి కాలువలో పూడికతీత పనులు ప్రారంభం
చిత్రం న్యూస్, సాత్నాల: ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ రైతు వారోత్సవాల్లో భాగంగా సాత్నాల మండల కేంద్రంలోని ప్రాజెక్టు కుడి కాలువ పరిధిలో మేడిగూడ-సి కెనాల్ వద్ద పూడికతీత పనులను జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో పూజ కార్యక్రమాలతో పనులు ప్రారంభమయ్యాయి. అనంతరం సాత్నాల ప్రాజెక్టును పరిశీలించిన కలెక్టర్, మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.69 లక్షల నిధులు మంజూరు చేసిందని తెలిపారు. త్వరలోనే మరమ్మతు పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదలశాఖ ఈఈ ఉమామహేశ్వరరావు, డీఈ శ్రీనివాసరావు, ఏఈ మహేష్, ఎంఆర్ఓ రామారావు, ఎంపీడీఓ వెంకట్ రాజు, ఏపీఓ వెంకట రమణ, సర్పంచ్ అంజనా బాయి తదితరులు పాల్గొన్నారు.
