Chitram news
Newspaper Banner
Date of Publish : 07 May 2026, 9:32 pm Editor : Chitram news

పంట వ్యర్థాలను తగలబెట్టొద్దు: జిల్లా కలెక్టర్ రాజర్షి షా

పంట వ్యర్థాలను తగలబెట్టొద్దు: జిల్లా కలెక్టర్ రాజర్షి షా

* నేల తల్లికి నష్టం.. పర్యావరణానికి ముప్పు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: పంట కోతల అనంతరం మిగిలిపోయే అవశేషాలను తగలబెట్టడం వల్ల పర్యావరణంతో పాటు భూసారం తీవ్రంగా దెబ్బతింటుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా రైతులను హెచ్చరించారు. వ్యర్థాలను కాల్చడం వల్ల కలిగే అనర్థాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ, రైతులకు పలు సూచనలు చేశారు. వ్యర్థాలను కాల్చడం వల్ల వెలువడే హానికర వాయువులు వాయు కాలుష్యాన్ని పెంచుతాయని , దీనివల్ల అటు ప్రజలు, ఇటు పశువుల శ్వాసకోశ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. మంటల వల్ల నేలలోని నత్రజని, భాస్వరం వంటి కీలక పోషకాలు ఆవిరైపోతాయి. మేలు చేసే సూక్ష్మజీవులు నశించి, భూమి చవిటిగా మారుతుంది. దీనివల్ల పంట దిగుబడి తగ్గడమే కాకుండా, రసాయన ఎరువుల కోసం రైతులు అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. అవశేషాలను తగలబెట్టడానికి బదులుగా ఆధునిక పద్ధతులను అనుసరించాలని కలెక్టర్ సూచించారు. రోటవేటర్ ద్వారా వ్యర్థాలను భూమిలో కలియదున్నడం వల్ల అవి సేంద్రీయ ఎరువుగా మారి నేలకు బలాన్నిస్తాయని, పంట వ్యర్థాలను కంపోస్ట్ లేదా వర్మీ కంపోస్ట్‌గా మార్చుకోవాలన్నారు. వరి గడ్డిని తగలబెట్టకుండా పశుగ్రాసంగా వినియోగించుకోవాలని, పర్యావరణాన్ని కాపాడుతూ అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను పాటించాలని కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు.