జైనథ్ మార్కెట్లో ‘జొన్న’ రైతుల ఇబ్బందులు
- గన్నీ బ్యాగులు లేక నిలిచిన కొనుగోలు
- నేషనల్ హై వే వరకు నిలిచిన వాహనాలు
చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో జొన్న రైతుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అధికారుల పర్యవేక్షణ లోపం, ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్కు జొన్నలు వచ్చి రెండు రోజులు గడుస్తున్నా, గన్నీ బ్యాగుల కొరత కారణంగా తూకాలు కావడం లేదు. కొనుగోలు చేసిన పంటను గోదాములకు తరలించేందుకు సరిపడా లారీలు అందుబాటులో లేకపోవడంతో మార్కెట్ అంతా ధాన్యపు రాశులతో నిండిపోయింది. కిలోమీటర్ల కొనుగోళ్లు నిలిచిపోవడంతో మార్కెట్ బయట సుమారు రెండు రోజులుగా వందలాది ట్రాక్టర్లు క్యూలో వేచి ఉన్నాయి. ఎండ వేడికి తట్టుకోలేక, అకాల వర్షం కురుస్తుందేమో అన్న భయంతో రైతులు రాత్రింబవళ్లు అక్కడే పడిగాపులు కాస్తున్నారు. “ఏడాది పొడవునా కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి ఇన్ని తిప్పలు పడాలా?” అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సరిపడా గన్నీ బ్యాగులను సరఫరా చేయాలని, లారీల సౌకర్యం కల్పించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని జైనథ్ రైతులు డిమాండ్ చేస్తున్నారు.
