నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యం: జిల్లా కలెక్టర్ రాజర్షిషా
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. బుధవారం తెలంగాణ మైనారిటీ గురుకుల బాలికల పాఠశాల ఆవరణలో క్రీడలు, యువజన సేవల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ ‘జాబ్ మేళా’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా కలెక్టర్ జాబ్ మేళాలో ఏర్పాటు చేసిన వివిధ కంపెనీల స్టాల్లను సందర్శించి నిర్వాహకులతో మాట్లాడారు. అనంతరం వివిధ కంపెనీలకు ఎంపికైన అభ్యర్థులకు ఆయన నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. యువత తమ నైపుణ్యాలను పెంపొందించుకుని ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రైవేట్ రంగంలో కూడా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని, కష్టపడి పనిచేస్తే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా యువజన క్రీడల అధికారి శ్రీనివాస్, ఉపాధి కల్పన అధికారి మిల్కా, ఈడీ మనోహర్, ఇతర ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొన్నారు.
