Chitram news
Newspaper Banner
Date of Publish : 02 May 2026, 7:26 pm Editor : Chitram news

ఆదిలాబాద్ అభివృద్ధికి రూ.30 కోట్లు: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం – ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఆదిలాబాద్ అభివృద్ధికి రూ.30 కోట్లు: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం – ఎమ్మెల్యే పాయల్ శంకర్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో, ఆదిలాబాద్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. ఆదిలాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా రూ.30 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు ప్రకటించారు. ఈ నిధులను నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు సమానంగా పంపిణీ చేసి, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని ఆయన తెలిపారు. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించే విషయంలో రాజకీయం చేయకూడదని, అందరినీ సమానంగా చూస్తూ అభిప్రాయాలను గౌరవించాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించి, సమన్వయంతో పనిచేస్తేనే ప్రగతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రజా సమీక్షా సమావేశాలను నిర్వహించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలని, వాటికి గౌరవం ఇవ్వాలని తెలిపారు.ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష, టీజీ ఎస్సీపీసీఆర్ సభ్యురాలు ప్రేమలత అగర్వాల్, అదనపు ఎస్పీ సురేందర్ రావు, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్ రావు, డీపీఓ రమేష్, అదనపు డీఎంహెచ్‌ఓ డాక్టర్ సాధన, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.