జొన్నలు కొనుగోలు చేయాలని జాతీయ రహదారిపై బీఆర్ఎస్, రైతుల ధర్నా
చిత్రం న్యూస్, జైనథ్: రైతులు పండించిన జొన్న పంటను తక్షణమే ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం జైనథ్ మండలం బెల్గాం గ్రామ సమీపంలోని 353 బీ జాతీయ రహదారి పై బీఆర్ఎస్ నాయకులు అడ్డి పురుషోత్తం రెడ్డి, జంగిలి విలాష్, సోమ రాంరెడ్డి,మాదస్తు వెంకన్న, నితిన్ రెడ్డి, బొల్లి గంగన్న, బండి స్వామి, రైతులు శ్రీకాంత్ , సుశాంత్ రెడ్డి,సునీల్ తదితరులు భారీ ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు జాతీయ రహదారిపై ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు పెట్టి రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీనివల్ల ఆదిలాబాద్ – మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయి వాహనాలు నిలిచిపోయాయి. మార్క్ఫెడ్ ద్వారా జొన్నలు, శ,నగ పంటలను వెంటనే కొనుగోలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన రూ. 3,699 మద్దతు ధరను రైతులకు అందించాలన్నారు. బహిరంగ మార్కెట్లో దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా పంటను కొనుగోలు చేసేవారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంలో తీవ్ర జాప్యం చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు.ఘటనా స్థలానికి చేరుకున్న ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి, ఎస్ఐ గౌతమ్ పోలీసులు ఆందోళనకారులతో చర్చలు జరిపి, ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.
