ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్గా బోరంచు శ్రీకాంత్ రెడ్డి బాధ్యతల స్వీకారణ
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమితులైన బోరంచు శ్రీకాంత్ రెడ్డి శనివారం జిల్లా కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఘనంగా బాధ్యతలు స్వీకరించారు. ముందుగా అధికారులు ఆయనతో బాధ్యతలు స్వీకరింపజేసిన అనంతరం, వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య కుటుంబ సభ్యుల సమక్షంలో శ్రీకాంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ..తనపై విశ్వాసం ఉంచి ఈ కీలక బాధ్యతను అప్పగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు పెద్ది సుదర్శన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేముల నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
మార్కెట్ కమిటీ అభివృద్ధికి, రైతుల సమస్యల పరిష్కారానికి తాను కట్టుబడి పనిచేస్తానని, రైతులకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధికారులు, సిబ్బంది, వివిధ రైతు, కుల రాజకీయ సంఘాల నాయకులు, రైతులు పాల్గొని శ్రీకాంత్ రెడ్డిని శాలువాలు, పుష్పగుచ్చాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
