పదో తరగతి ఫలితాల్లో జైనథ్ జడ్పీహెచ్ఎస్ ప్రభంజనం
- వంద శాతం ఉత్తీర్ణతతో విద్యార్థుల ప్రతిభ
చిత్రం న్యూస్, జైనథ్: బుధవారం విడుదలైన పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలలో జైనథ్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (Z.P.H.S) విద్యార్థులు రికార్డు స్థాయి విజయాన్ని అందుకున్నారు. పరీక్షలకు హాజరైన మొత్తం 90 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి, పాఠశాలకు వందశాతం ఫలితాలను అందించారు.
మండల టాపర్గా సాయి స్మృతి: ఈ ఫలితాల్లో సాయి స్మృతి అనే విద్యార్థిని 600 మార్కులకు గానూ 576 మార్కులు సాధించి మండలంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. సాయి స్మృతి ప్రతిభపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. కాగా, పాఠశాల విద్యార్థులలో 40 మంది 500 కంటే ఎక్కువ మార్కులు సాధించడం విశేషం. విద్యార్థులందరూ మంచి స్కోర్తో పాస్ కావడంతో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్ధులు ఆనందం వ్యక్తం చేశారు
ఉపాధ్యాయుల కృషితోనే ఈ విజయం: ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మద్ది లస్మన్న మాట్లాడుతూ..విద్యార్థుల పట్టుదల, ఉపాధ్యాయుల నిరంతర కృషి వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని కొనియాడారు. విద్యార్థులను, వారికి వెన్నుముకగా నిలిచిన ఉపాధ్యాయ బృందాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని ఈ ఫలితాలు నిరూపించాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
