Chitram news
Newspaper Banner
Date of Publish : 27 April 2026, 7:45 pm Editor : Chitram news

ఆదిలాబాద్ హత్య కేసు ఛేదించిన పోలీసులు: 48 గంటల్లోనే నిందితుడు అరెస్ట్

ఆదిలాబాద్ హత్య కేసు ఛేదించిన పోలీసులు: 48 గంటల్లోనే నిందితుడు అరెస్ట్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలో సంచలనం సృష్టించిన అనిత అనే మహిళ హత్య కేసును వన్ టౌన్ పోలీసులు కేవలం 48 గంటల్లోనే ఛేదించారు. ఏప్రిల్ 24న హల్దీరాం ప్రాంతంలోని పంజాబ్ చౌక్ సమీపంలో ఉన్న డ్రైనేజీ కాలువలో అనిత మృతదేహం లభ్యమైంది. తొలుత దీనిని అనుమానాస్పద మృతిగా భావించినప్పటికీ, పోలీసుల విచారణలో ఇది దారుణ హత్యగా తేలింది.

మృతురాలి సోదరుడు జనగం వార్ సంతోష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని గుర్తించారు. మహారాష్ట్రకు చెందిన నర్సింగ సంతోబా గంపల్వాడ్ (25) అనే కూలీ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు నిర్ధారించారు. ఏప్రిల్ 27న ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల విచారణలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు వెల్లడైంది. నిర్మానుష్య ప్రాంతంలో అనితపై దాడి చేయగా ఆమె ప్రతిఘటించడంతో ఆగ్రహానికి గురైన నిందితుడు ఆమెను హత్య చేసి, మృతదేహాన్ని డ్రైనేజీ కాలువలో పడవేసి పరారయ్యాడు.

అత్యంత వేగంగా కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ అభినందించి, రివార్డులను ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,  భద్రత కోసం సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు.