చెన్నూరి వర్షిణికి సనాతన హిందూ సేవా సమితి అండ
చిత్రం న్యూస్, వరంగల్: ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడమే పరమావధిగా భావించే ‘సనాతన హిందూ సేవా సమితి’ తన సేవా ప్రస్థానంలో మరో మైలురాయిని చేరుకుంది. సమితి ఆధ్వర్యంలో ఈరోజు 180వ సేవా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
వరంగల్లోని కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన చెన్నూరి వర్షిణి అనే యువతి తీవ్ర ఆరోగ్య సమస్యలతో పాటు, ఎటువంటి ఆధారం లేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ విషయం తెలుసుకున్న సనాతన హిందూ సేవా సమితి సభ్యులు మానవత్వంతో స్పందించారు. ఆమెకు బాసటగా నిలుస్తూ, రెండు నెలలకు సరిపడా బియ్యం, నిత్యావసర వస్తువులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రూప్ వ్యవస్థాపకుడు తాళ్లపల్లి నగేష్, అధ్యక్షుడు మిట్టపెల్లి వేణు, సలహాదారు ప్రతాపగిరి గణేష్ పాల్గొన్నారు. వీరితో పాటు గ్రూప్ సభ్యులు గంగిడి ధర్మారెడ్డి, పెరుమాండ్ల శ్రవణ్, మేరుగు కరుణాకర్, పేర్ణ భరత్, బండారి సంపత్, దిడ్డి మోహన్, గుండేటి రజిని కుమార్, నాగుల మోహన్, నోముల రాజేశ్వర్ తదితరులు పాల్గొని వర్షిణి కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చారు. కష్టకాలంలో తమను ఆదుకున్న సేవా సమితి సభ్యులకు వర్షిణి కృతజ్ఞతలు తెలియజేశారు.