ఏప్రిల్ 27న ‘గోమాత గౌరవ దినోత్సవం’ జరపాలి: భీంపూర్ తహసీల్దార్కు వినతిపత్రం అందజేత
చిత్రం న్యూస్, భీంపూర్: ప్రతి సంవత్సరం ఏప్రిల్ 27వ తేదీని ‘గోమాత గౌరవ దినోత్సవం’గా అధికారికంగా ప్రకటించి, ఘనంగా నిర్వహించాలని కోరుతూ భీంపూర్ మండల తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. గో సంరక్షకులు, గోశాల నిర్వాహకుల పిలుపు మేరకు మండలంలోని వివిధ గ్రామాల సర్పంచుల ఆధ్వర్యంలో సోమవారం ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సనాతన హిందూ ధర్మ వేదిక ఉపాధ్యక్షులు ఏనుగు అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో గోమాతను రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఆవుకు ‘రాష్ట్ర మాత’ లేదా ‘రాజ్యాంగ మాత’ హోదా కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. గో సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచడమే ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా గోశాలల్లో ప్రత్యేక పూజలు, ప్రదక్షిణలు నిర్వహించి, గోరక్షణ ఆవశ్యకతను చాటిచెప్పాలని పిలుపునిచ్చారు.
హిందూ సంస్కృతిలో గోవును సకల దేవతా స్వరూపంగా భావిస్తామని, ఆవు ద్వారా లభించే పంచగవ్యాలు మానవాళికి ఎంతో మేలు చేస్తాయని వారు వివరించారు. గో రక్షణే ధర్మమని, దీనిని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సర్పంచులు రవీందర్ జాదవ్, కాల్చప్ యాదవ్, లింబాద్రి, అర్లి (టి) గో సంరక్షణ కమిటీ సభ్యులు, గో సేవకులు మరియు స్థానికులు పాల్గొన్నారు.