Chitram news
Newspaper Banner
Date of Publish : 27 April 2026, 5:59 pm Editor : Chitram news

మేడే’ వేడుకలను జయప్రదం చేయండి: సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి

మేడే’ వేడుకలను జయప్రదం చేయండి: సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: సీపీఐ కార్యాలయంలో సోమవారం సీపీఐ జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మే 1న జరగనున్న 141వ మేడే వేడుకలను జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

సమావేశంలో ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. 1886కు ముందు అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులు వెట్టిచాకిరీ, బానిసత్వానికి వ్యతిరేకంగా సాగించిన వీరోచిత పోరాటాన్ని గుర్తుచేశారు. ఎనిమిది గంటల పని దినం కోసం పోరాడిన కార్మికులను అప్పటి అమెరికా ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కాల్చిచంపిందని, లక్షలాది మంది రక్తం చిందించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రక్తపు ధారల్లో తడిసిన కార్మికుడి చొక్కాయే నేడు ఎర్రజెండాగా మారి ప్రపంచ కార్మిక వర్గానికి స్ఫూర్తిగా నిలుస్తోందని కొనియాడారు.

బానిసత్వం నుండి విముక్తి పొందేందుకు, హక్కుల సాధన కోసం మేడే స్ఫూర్తితో కార్మికులు మరిన్ని పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యురాలు ముడుపు నలినీ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు కుంటల రాములు, జిల్లా కౌన్సిల్ సభ్యులు ఎస్. అరుణ్, షేక్ పాషా, బెజ్జంకి నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.