విద్యుత్ సమస్యల పరిష్కారమే మా లక్ష్యం: మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష సతీష్
* మున్సిపాలిటీ, విద్యుత్ శాఖ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న విద్యుత్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష సతీష్ స్పష్టం చేశారు. మున్సిపల్ కార్యాలయంలో విద్యుత్ శాఖ ఏఈలు వినోద్, సదానందం, మున్సిపల్ డీఈ కార్తీక్, ఏఈలు నితిన్, కిరణ్లతో కలిసి ఆమె ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ.. గత పది రోజులుగా 49 వార్డుల్లో మున్సిపల్ వార్డ్ ఆఫీసర్లు, ఎలక్ట్రిసిటీ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సేకరించిన నివేదికలను విద్యుత్ అధికారులకు అందజేశారు. పట్టణంలోని ప్రధాన రహదారులతో పాటు అంతర్గత వీధుల్లో స్ట్రీట్ లైట్ థర్డ్ వైర్లను వెంటనే పునరుద్ధరించాలని ఆమె ఆదేశించారు. ముఖ్యంగా విలీన గ్రామపంచాయతీల్లో థర్డ్ వైర్ నిర్వహణకు అవసరమైన నిధులను మున్సిపాలిటీ నుంచి చెల్లించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రమాదకరంగా ఉన్న పాత విద్యుత్ స్తంభాలు, వంకరగా ఉన్న పోల్స్, దెబ్బతిన్న పోల్స్ను తొలగించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు, లో-వోల్టేజ్ సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి, అదనపు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. వర్షాకాలం దృష్ట్యా లోతట్టు ప్రాంతాల్లో వేలాడుతున్న విద్యుత్ తీగలను (లూజ్ వైర్లు) వెంటనే సరిచేసి, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మున్సిపల్, విద్యుత్ శాఖలు సమన్వయంతో పని చేస్తూ ప్రజా ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఇరు శాఖల అధికారులు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.