Chitram news
Newspaper Banner
Date of Publish : 24 April 2026, 10:45 pm Editor : Chitram news

ఆదిలాబాద్‌లో అక్రమ వడ్డీ వ్యాపారులపై పోలీసుల మెరుపు దాడులు: భారీగా పత్రాలు సీజ్

ఆదిలాబాద్‌లో అక్రమ వడ్డీ వ్యాపారులపై పోలీసుల మెరుపు దాడులు: భారీగా పత్రాలు సీజ్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్:  జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అక్రమ వడ్డీ వ్యాపారులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. అమాయక ప్రజలను, రైతులను అధిక వడ్డీలతో వేధిస్తున్న వడ్డీ మాఫియాను అరికట్టడమే లక్ష్యంగా ఈ భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జిల్లాలోని 16 మండలాలు, 15 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏకకాలంలో దాడులు జరిగాయి. ఈ ఆపరేషన్‌లో మొత్తం 45 పోలీసు బృందాలు పాల్గొని వడ్డీ వ్యాపారుల నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అక్రమ వడ్డీ వ్యాపారులపై ఇప్పటికే 15 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దాడుల సమయంలో అక్రమంగా కలిగి ఉన్న ప్రామిసరీ నోట్లు, ఖాళీ చెక్కులు, పట్టాదార్ పాస్ పుస్తకాలు, బాండ్ పేపర్లు  సేల్ డీడ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

రైతుల నుంచి వ్యవసాయ భూములను తాకట్టు పెట్టుకుని, అధిక వడ్డీలతో వారిని ఇబ్బందులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. భూకబ్జాలు వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను సహించేది లేదని, ప్రజలు ఇలాంటి మోసగాళ్ల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ఎవరైనా అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.