Chitram news
Newspaper Banner
Date of Publish : 24 April 2026, 10:03 pm Editor : Chitram news

ఆదిలాబాద్‌ రిమ్స్‌లో ఆధునిక నైపుణ్యాభివృద్ధి సదస్సు.. యువతకు ఉజ్వల భవిష్యత్తుపై దిశానిర్దేశం

ఆదిలాబాద్‌ రిమ్స్‌లో ఆధునిక నైపుణ్యాభివృద్ధి సదస్సు.. యువతకు ఉజ్వల భవిష్యత్తుపై దిశానిర్దేశం

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్  రిమ్స్ (RIMS) ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించిన ఆధునిక నైపుణ్యాభివృద్ధి అవగాహన సదస్సు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి వెలిగించి సదస్సును ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో రిమ్స్ డైరెక్టర్ డా.జై సింగ్ రాథోడ్, జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి గణేష్ జాదవ్, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం.మనోహర్ రావు, మైనార్టీ సంక్షేమ అధికారి కలీం, యువజన క్రీడల అధికారి జక్కుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

యువతకు నైపుణ్యాల ఆవశ్యకతపై అధికారుల పిలుపు:

సదస్సులో పాల్గొన్న జిల్లా అధికారులు మాట్లాడుతూ, మారుతున్న ప్రపంచ పోకడలు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఇంటర్మీడియెట్, కళాశాల విద్యార్థులు, యువత తమ నైపుణ్యాలను (Skills) పెంపొందించుకోవాలని సూచించారు. ఆధునిక సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి (Modern Skill Development) ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుందని, కేవలం డిగ్రీలే కాకుండా నైపుణ్యం కూడా ముఖ్యమని స్పష్టం చేశారు.

99 రోజుల కార్యక్రమంలో ప్రత్యేక చొరవ:

మార్చి 6 నుంచి జూన్ 12 వరకు కొనసాగే ఈ 99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా యువతకు, విద్యార్థులకు, మహిళలకు అవగాహన కల్పించడం, క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.