పొన్నారిలో ఉపాధి హామీ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా
చిత్రం న్యూస్, తాంసి: తాంసి మండలం పొన్నారి గ్రామంలో కొనసాగుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను జిల్లా కలెక్టర్ రాజర్షిషా గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పూడికతీత పనులను స్వయంగా పరిశీలించిన ఆయన కూలీల మస్టర్ రోల్స్ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ఉపాధి హామీ కూలీల ఆరోగ్యం పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రతి పని ప్రదేశంలోనూ తప్పనిసరిగా నీడ సౌకర్యం, స్వచ్ఛమైన మంచినీరు, ఓఆర్ఎస్ (ORS) ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. అనంతరం కలెక్టర్ స్వయంగా కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (DRDO) రవీందర్, మండల అభివృద్ధి అధికారి (MPDO) మోహన్ రెడ్డి, తహసీల్దార్ లక్ష్మీ, సర్పంచ్ భీమన్న, ఏపీఓ విజయ, టెక్నికల్ అసిస్టెంట్ పుష్ప, ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.