శనగ రైతులను ఆదుకోవాలని మంత్రి జూపల్లికి కంది శ్రీనివాస్ రెడ్డి బృందం వినతి
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లాలోని రైతుల వద్ద నిల్వ ఉన్న శనగలను వెంటనే ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి తరపున జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీజన్ ముగుస్తున్నా ఇంకా చాలా మంది రైతుల వద్ద శనగ పంట నిల్వ ఉండిపోయిందని, మార్కెట్లో మద్దతు ధర రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాల ద్వారా మిగిలిన శనగలను సేకరించి రైతులకు భరోసా కల్పించాలని కోరారు. వినతిపై సానుకూలంగా స్పందించిన మంత్రి, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ సంతోష్ రావు, బండారి సతీష్, డేరా కృష్ణ రెడ్డి ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.