రిమ్స్ ఆసుపత్రిలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆకస్మిక తనిఖీ: రోగుల ఇబ్బందులపై సీరియస్
చిత్రం న్యూస్,ఆదిలాబాద్: ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మంగళవారం రిమ్స్ (RIMS) ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించి, అక్కడి పరిస్థితులను సమీక్షించారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించిన ఆయన, రోగులతో నేరుగా మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రిలోనే అధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రిమ్స్ ఆసుపత్రిలో వనరులు, సిబ్బంది, వైద్యుల కొరత వల్ల సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అందడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ వంటి మారుమూల ప్రాంత ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 150 కోట్ల భారీ వ్యయంతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించినప్పటికీ, సిబ్బంది లేకపోవడం వల్ల ఆ సౌకర్యాలు వృధా అవుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే కొంతమంది వైద్యులను నియమించినా, పూర్తిస్థాయిలో సేవలు అందాలంటే మరిన్ని నియామకాలు జరగాలని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగంతో చర్చిస్తానని హామీ ఇచ్చారు.
ఆసుపత్రిలో బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండటంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యర్థాల నిర్వహణ సరిగా లేకపోతే రోగుల ఆరోగ్యం మరింత ప్రమాదంలో పడుతుందని, తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ సమీక్షా సమావేశంలో రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, ఆసుపత్రి సూపరింటెండెంట్, పలువురు వైద్యులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు ఎమ్మెల్యే వెంట బీజేపి నాయకులు ముకుంద్ రావు, కృష్ణ యాదవ్ తదితరులు ఉన్నారు.