శనగ పంట కొనుగోలు చేయాలని జాతీయ రహదారిపై నేతల ధర్నా
చిత్రం న్యూస్, జైనథ్: నిలిచిపోయిన శనగ కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్, అఖిలపక్ష నాయకులు జైనథ్ జాతీయ రహదారిపై మంగళవారం ధర్నా నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో శనగ పంట మధ్యంతరంగా నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
పండించిన పంటను అమ్ముకోలేక రైతులు ఆందోళన చెందుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోళ్లు పునరుద్ధరించాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సర్సన్ లింగారెడ్డి డిమాండ్ చేశారు. మొత్తం 1.26 లక్షల క్వింటాల్లో లక్ష క్వింటాళ్ళు కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడంలో జాప్యం జరుగుతోందని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అధికారులు స్పందించి వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని నాయకులు ఈ సందర్భంగా హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు లింగారెడ్డి, మాజీ ఎంపీపీ మార్చెట్టి గోవర్ధన్, నాయకులు పిడుగు స్వామి యాదవ్, నిలేష్ రెడ్డి, గణేష్ యాదవ్, గంగన్న, సోమ రాంరెడ్డి, పురుషోత్తం రెడ్డి, వెంకన్న, కొప్పుల దేవన్న, పలువురు ప్రజాప్రతినిధులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.