ఆదిలాబాద్లో ఘనంగా బసవేశ్వర జయంతి: నివాళులర్పించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ గోడం నగేశ్
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో జగద్గురు బసవేశ్వర జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ గోడం నగేశ్ ముఖ్య అతిథులుగా పాల్గొని, బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. సమాజంలో వేళ్లూనుకున్న వివక్షను నిర్మూలించడానికి, కులమతాలకు అతీతంగా సమానత్వాన్ని సాధించడానికి బసవేశ్వరుడు చేసిన పోరాటం మరువలేనిదని కొనియాడారు. ఆయన బోధనలు నేటి సమాజానికి ఎంతో ఆవశ్యకమని పేర్కొన్నారు.
అనంతరం ఎంపీ గోడం నగేశ్ మాట్లాడుతూ.. బసవేశ్వరుని ఆశయాలకు అనుగుణంగా న్యాయం, గౌరవం, సమానత్వం కలిగిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆయన చూపిన మార్గం ప్రపంచానికే మార్గదర్శకమని తెలిపారు.
ఈ వేడుకల్లో స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు, బసవన్న భక్తులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.