ఖానాపూర్ చెరువు సుందరీకరణకు రూ.3.14 కోట్లతో శంకుస్థాపన
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఖానాపూర్ చెరువు అభివృద్ధి, సుందరీకరణ పనులకు ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్, స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష సతీష్, ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్ సోమవారం శంకుస్థాపన చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రజా ఆరోగ్యం, పునరుజ్జీవనం, జలవనరుల పరిరక్షణలో భాగంగా ఈ నిధులు మంజూరయ్యాయి.
సుమారు రూ.3.14 కోట్ల నిధులతో చేపట్టనున్న ఈ పనుల ద్వారా చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే కాకుండా, భూగర్భ జలాల పెంపునకు చర్యలు తీసుకోనున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అభివృద్ధి పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు, బీజేపీ , కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.