జైనథ్ బస్ స్టాండ్ ఆవరణలో చలివేంద్రం ప్రారంభం
చిత్రం న్యూస్, జైనథ్: పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, ప్రయాణికులు, బాటసారుల దాహార్తిని తీర్చడానికి జైనథ్ గ్రామ పంచాయతీ ప్రత్యేక చొరవ తీసుకుంది. స్థానిక బస్ స్టాండ్ ఆవరణలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఈరోజు ఘనంగా ప్రారంభించారు.
వేసవి తాపం నుండి ప్రజలకు ఉపశమనం కలిగించడమే ధ్యేయంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పంచాయతీ ప్రతినిధులు తెలిపారు. ముఖ్యంగా దూర ప్రాంతాల నుండి వచ్చే ప్రయాణికులకు, కూలీలకు, రైతులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. వేసవిలో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యమన్నారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ముజీబ్, ఉప సర్పంచ్ పిడుగు సంతోష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జగదీశ్ రెడ్డి, బీజేపీ గ్రామ అధ్యక్షుడు చిలుకూరి లింగారెడ్డి,వార్డు సభ్యులు కోవ సారథి, స్వామి, గంగన్న, పరశురాం, గ్రామ పెద్దలు పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు.