Chitram news
Newspaper Banner
Date of Publish : 17 April 2026, 3:51 pm Editor : Chitram news

ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: కలెక్టరేట్ ఎదుట TGEJAC నేతల నిరసన 

ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: కలెక్టరేట్ ఎదుట TGEJAC నేతల నిరసన 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ TGEJAC నాయకులు అదిలాబాద్ జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

2వ పీఆర్సీ అమలు: రెండవ పిఆర్సీ నివేదికను తక్షణమే తెప్పించుకుని, జూన్ 2వ తేదీలోపు 51% ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలని డిమాండ్ చేశారు.

పెండింగ్ బిల్లుల విడుదల: రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న సుమారు ₹13,000 కోట్ల బిల్లులను ఏకమొత్తంగా విడుదల చేసి, రిటైర్డ్ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఆర్థిక వెసులుబాటు కల్పించాలని కోరారు.

ఆరోగ్య కార్డుల మంజూరు: ఉద్యోగులు మరియు పెన్షనర్ల కోసం కొత్త EHS (Employee Health Scheme) విధానాన్ని రూపొందించి, మే 1వ తేదీ నుండి నగదు రహిత వైద్య సేవలు అందేలా చూడాలని విన్నవించారు.

Cps రద్దు – OPS పునరుద్ధరణ: కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS)ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించాలని, ముఖ్యంగా 2004 సెప్టెంబర్ 1 కంటే ముందు నోటిఫికేషన్ ద్వారా నియామకమైన వారికి పాత పెన్షన్ వర్తింపజేయాలని, తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన పరిష్కరించేలా చొరవ చూపాలని ఈ సందర్భంగా వారు కలెక్టర్‌ను కోరారు. నిర్ణీత గడువులోగా సమస్యలు పరిష్కారం కాకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని TGEJAC నాయకులు హెచ్చరించారు.  కార్యక్రమంలో  ఆయా సంఘాల జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా, మండల భాద్యులు పాల్గొన్నారు.