Chitram news
Newspaper Banner
Date of Publish : 17 April 2026, 3:17 pm Editor : Chitram news

బీజేపీ ఎంపీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్ శ్రేణులు 

బీజేపీ ఎంపీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్ శ్రేణులు 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: తెలంగాణ ఏర్పాటును దేశ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిరసన తెలిపారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నరేష్ జాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ లో తేజస్వి సూర్య దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా చట్టాలకు లోబడి పార్లమెంట్ ప్రక్రియ ద్వారా ఒక రాష్ట్రం ఏర్పడటాన్ని దేశ విభజనతో ముడిపెట్టి శత్రుదేశమైన పాకిస్థాన్ తో పోల్చడం క్షమించరాని నేరమని, ఇది దేశద్రోహానికి సమానమని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన దీర్ఘకాల పోరాటం, వేలాది అమరుల త్యాగాలను అవమానించేలా బీజేపీ ఎంపీ తేజస్వి వ్యాఖ్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేసిన ఎంపీపై వెంటనే చర్యలు తీసుకుని పార్లమెంట్ నుండి సస్పెండ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని తెలంగాణ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, మార్కెట్ కమిటీ  మాజీ చైర్మన్ అల్లూరి సంజీవ్ రెడ్డి, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, డీసీసీ కార్యవర్గ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.