Chitram news
Newspaper Banner
Date of Publish : 17 April 2026, 2:14 pm Editor : Chitram news

మొక్కజొన్న సబ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

మార్క్ ఫెడ్ ఎండీ ని కలిసిన ఎమ్మెల్యేలు పవార్ రామారావు పటేల్, అనిల్ జాదవ్ 

చిత్రం న్యూస్, బాసర: మొక్కజొన్న రైతుల పంటను ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేస్తామని, ఈపాటికి అన్ని మండలాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు. శుక్రవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తో పాటు ఆయన హైదరాబాద్ లో మార్క్ ఫెడ్ ఎండీ శ్రీనివాస్ రెడ్డిని  కలిసిన సందర్భంగా మాట్లాడారు. ముథోల్ నియోజకవర్గంలో ఎక్కువ మొత్తంలో మొక్కజొన్న పంట ఉందని, భారీ వర్షాలతో రైతుల నష్టపోయారని ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేపడితే కొంతైనా మేలు జరుగుతుందని ఆయన తెలిపారు. బహిరంగ మార్కెట్లో ధర తక్కువగా ఉన్నందున ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పంట అమ్మితే క్వింటాలుకు రూ.700 వరకు అధిక ధర వస్తుందని, వెంటనే కొనుగోలు చేపట్టి, పంట అమ్మినా డబ్బులను రైతుల ఖాతాల్లో సత్వరం వేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి మండలంలో ప్రధాన కొనుగోలు కేంద్రాలతో పాటు సబ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే పంట అమ్ముకోవడానికి ఇబ్బందులు ఉండవని, ఎక్కడెక్కడ సబ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలో ఆయన రాతపూర్వకంగా ఎండీకి వివరించారు. నియోజకవర్గంలో 30కి పైగా సబ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలగకుండా అమ్మకానికి పంట తెచ్చిన వెంటనే కొనుగోలు చేసేలా చర్యలు చేపడతామన్నారు. మొక్కజొన్న రైతులు ఆందోళన పడకుండా తమ పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలని ఎమ్మెల్యే సూచించారు.