రహదారి ప్రమాదాల నివారణకు సమన్వయంతో కృషి చేయాలి: అదనపు కలెక్టర్లు
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: రహదారి ప్రమాదాల నివారణకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఆదిలాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ రాజేశ్వర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ ఆర్.ఎస్. చిత్రు సూచించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘రోడ్డు భద్రత అవగాహన’ సమీక్షా సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ, విలువైన ప్రాణాలను బలిగొంటున్న రహదారి ప్రమాదాలను తగ్గించేందుకు సంబంధిత శాఖలు పరస్పర సహకారంతో పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేవలం నిబంధనలు అమలు చేయడమే కాకుండా, ట్రాఫిక్ నియమాలపై వాహనదారులకు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ముఖ్యంగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను (బ్లాక్ స్పాట్స్) గుర్తించి, అక్కడ తగిన రక్షణ చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.
ఈ సమీక్షా సమావేశంలో రెవెన్యూ, రవాణా, పోలీసు, మున్సిపల్ శాఖల ఉన్నతాధికారులు, రోడ్లు-భవనాల శాఖ (R&B) ఇంజనీర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.