జైనథ్ లో వైభవంగా ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి సమావేశం
చిత్రం న్యూస్,జైనథ్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక లో భాగంగా జైనథ్ మండల కేంద్రంలో గురువారం మండల స్థాయి సమీక్షా సమావేశం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజా ప్రతినిధులు, అధికారులు మరియు లబ్ధిదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
సమావేశం ప్రాంగణంలో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో భాగంగా గర్భిణులకు ప్రభుత్వ సాంప్రదాయ పద్ధతిలో సీమంతం నిర్వహించారు. అంగన్వాడీ కార్యకర్తలు మరియు అధికారులు గర్భిణులకు పండ్లు, పూలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సమావేశంలో అధికారులు మాట్లాడుతూ, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయడమే ఈ ‘ప్రగతి ప్రణాళిక’ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల వేగవంతం మరియు సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికపై ఈ వేదికగా చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ రమేష్, తహసీల్దార్ నారాయణ, మండల ప్రత్యేక అధికారి, మండల స్థాయి అధికారులు, సర్పంచులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.