బాసర రైతు వేదికలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం
చిత్రం న్యూస్, బాసర: ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల స్థాయి సమీక్ష సమావేశం బాసర రైతు వేదికలో నిర్వహించారు. ఈ సమావేశం ఎంపీడీవో దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది.ఈ సమావేశంలో మండలంలోని వివిధ శాఖల అధికారులు పాల్గొని ప్రభుత్వ పథకాల అమలు, ప్రగతి, ఎదుర్కొంటున్న సమస్యలు తదితర అంశాలపై చర్చించారు. గ్రామ స్థాయిలో ప్రజలకు అందుతున్న సేవలను మరింత మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. బాసర ఎంపీడీవో దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేయాలని సూచించారు. అలాగే, పనుల అమలులో పారదర్శకత పాటిస్తూ సమయానికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ పవన్ చంద్ర ఎంపీఓ గంగ ప్రసాద్, స్థానిక ప్రజాప్రతినిధులు, శాఖాధికారులు, సిబ్బంది మండల ప్రజలు పాల్గొన్నారు.