Chitram news
Newspaper Banner
Date of Publish : 15 April 2026, 7:32 pm Editor : Chitram news

విస్తృత స్థాయి అవగాహనతోనే రోడ్డు ప్రమాదాల నియంత్రణ: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

విస్తృత స్థాయి అవగాహనతోనే రోడ్డు ప్రమాదాల నియంత్రణ: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

మంత్రి పొన్నంకు ఘన స్వాగతం పలికిన కలెక్టర్, సీపీ, జిల్లా అధికారులు

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా అరైవ్ అలైవ్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు.

అరైవ్ అలైవ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు నిజామాబాద్ నగర పర్యటనకు బుధవారం విచ్చేసిన రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు. హెలికాఫ్టర్ ద్వారా మధ్యాహ్నం మూడు గంటల సమయంలో నిజామాబాద్ చేరుకున్న మంత్రిని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం హెలిప్యాడ్ వద్ద కలెక్టర్, పోలీస్ కమిషనర్ తో పాటు అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు, ఇతర జిల్లా అధికారులు పుష్ప గుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అక్కడి నుండి పోలీసు బందోబస్తు మధ్య కాన్వాయ్ ద్వారా మంత్రి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్దకు చేరుకున్నారు.

అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన కోసం చేపట్టిన బైక్ ర్యాలీని జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ ర్యాలీ కంటేశ్వర్ బైపాస్ చౌరస్తా వరకు చేరుకోగా, అక్కడ విద్యార్థులతో కలిసి మానవహారంగా ఏర్పడ్డారు. జిల్లా అధికారులతో పాటు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, నగర మేయర్ ఉమారాణి, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ తదితరులు మానవహారంలో భాగస్వాములు అయ్యారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి చేస్తామని, ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అతివేగం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. తద్వారా అనేక కుటుంబాలు ఇబ్బందులు పడాల్సి వస్తోందని అన్నారు. ఎన్ని చట్టాలు నిబంధనలు అమలు చేసినా, ప్రజలలో మార్పు రానంత వరకు ప్రమాదాలను నిలువరించడం సాధ్యం కాదని అన్నారు. దీనిని గుర్తిస్తూ పోలీస్ రవాణా శాఖల ఆధ్వర్యంలో ప్రజలలో అవగాహన కల్పించడం కోసం అరైవ్ అలైవ్ పేరుతో ప్రభుత్వం విస్తృత స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తోందని గుర్తు చేశారు. అన్ని వర్గాల వారు ఈ కార్యక్రమాల్లో పాల్గొని ప్రమాదాల నివారణకు తమవంతు దోహదపడాలని పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాలలో గాయపడిన క్షతగాత్రులను తక్షణమే స్పందించి ఆసుపత్రికి తరలించాలని, అలా కృషి చేసిన వారిని రహ్ వీర్ కింద రూ. 25 వేల నగదు ప్రోత్సాహకం ప్రభుత్వం ద్వారా అందజేయబడుతుందని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత వాహనాలు నడిపే సమయంలో తప్పనిసరిగా నిబంధనలు పాటిస్తూ, ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ హితవు పలికారు. ఈ కార్యక్రమాలలో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.