రోడ్డు భద్రతపై అవగాహనతోనే ప్రాణరక్షణ: ఎమ్మెల్యే పాయల్ శంకర్
చిత్రం న్యూస్,ఆదిలాబాద్: ప్రజా పాలనలో 99 రోజుల వేడుకల్లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఆదిలాబాద్లోని ఓ పాఠశాలలో ‘Arrive – Alive’ రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అధ్యక్షత వహించగా, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు జరిగిన తర్వాత బాధపడటం కంటే, ముందస్తు నివారణ చర్యలు తీసుకోవడమే మేలని సూచించారు. ప్రమాదాల వల్ల బాధితులే కాకుండా వారి కుటుంబాలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాహనదారులు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ వివరాలను తనిఖీ చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతూ, ఈ కార్యక్రమ నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ సదస్సులో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ చైర్మన్ బండారి అనూష సతీష్ రవాణా శాఖ అధికారులు, ఉపాధ్యాయులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.